ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆర్టీసీ ఆస్తులపై హైకోర్టులో తప్పుడు అఫిడవిట్ సమర్పించిన ఐఏఎస్లను ప్రాసిక్యూట్ చేయాలని పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం కార్మికులనుద్దేశించి వివేక్ మాట్లాడుతూ కార్మికులంతా సంఘటితంగా పోరాడితేనే డిమాండ్లను సాధించుకోవచ్చని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులకు జీతాల చెల్లింపు విషయంలో సీఎం కేసీఆర్ అసత్యపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో ఆర్టీసీ కార్మికులను చులకన చేసేలా వ్యవహరించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి అహంకార పూరిత ధోరణితో 25 మందికి పైగా కార్మికులు బలిదానాలకు పాల్పడ్డారని, సీఎం కేసీఆరే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తుగ్లక్లా వ్యవహరిస్తూ ఆర్టీసీ కార్మికుల సమస్యల సాధనలో మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. మిషన్ భగీరథ వంటి పథకాలలో వేల కోట్లు ప్రజాధనాన్ని దండుకొని రాష్ట్రంలో కుటుంబ మార్కు కనిపించేలా పని చేశారే తప్ప సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట సజ్జాత్, ఉనుకొండ భూమయ్యతోపాటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు.