తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. దాదాపు 110 మున్సిపాలిటీలతో పాటు 9 కార్పొరేషన్లు సైతం గులాబీ ఖాతాలోకే వెళ్లాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం కొన్ని చోట్ల ప్రతిఘటించినప్పటికి.. చివరకు ఐదు మున్సిపాలిటీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే భైంసా మున్సిపాలిటీల్లో మాత్రం అధికార-ప్రతిపక్ష పార్టీలకు ఓటర్లు అంతు చిక్కని విధంగా షాకిచ్చారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు భైంసాలో ఒక్కటంటే ఒక్క వార్డు కూడ దక్కకపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. దీంతో గులాబీ, హస్తం పార్టీలు భైంసాలో సున్నా సీట్లకే పరిమితమయ్యాయి. భైంసా మున్సిపాలిటీలో 26 వార్డులున్నాయి. ఇక్కడ ఎంఐఎం నుంచి 15 మంది, బీజేపీ నుంచి 9 మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇద్దరు ఇండిపెండెంట్లు సైతం విజయం సాధించడం విశేషం. తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ సునామీ సృష్టించిన గులాబీ దళం భైంసాలో మాత్రం బోణీ కొట్టలేకపోవడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది.