రైలు వేగం తగ్గడంతో ప్లాట్ఫాంపై దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తు రైలు చక్రాల మధ్య ఇరుక్కుపోయిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని స్టేషన్ పెండ్యాల వద్ద జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి వస్తున్న కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు స్టేషన్ పెండ్యాలకు చేరుకుంది. స్టేషన్లో రైలు వేగం తగ్గడంతో రైలు దిగేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి చక్రాల కిందపడ్డాడు. ఓ కాలు పూర్తిగా తెగిపోయింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ సడన్ బ్రేకులు వేయడంతో మరో కాలు తెగిపోయే ప్రమాదం తప్పింది. అయితే గంటపాటు చక్రాల కిందే ఉండిపోయిన బాధితుడు నరక యాతన అనుభవించాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద అతడిని రక్షించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.