ఉత్సాహంగా జరగాల్సిన పెళ్లి బారాత్లు విషాదాంతమవుతున్నాయి. రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా బోధన్లో పెళ్లి కొడుకు బారాత్లో డాన్స్ చేస్తుండగా కుప్పకూలిన ఘటన మరవక ముందే అలాంటి మరో పరిణామం జరిగింది. మెదక్ జిల్లా శివ్వంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్క పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన బారాత్లో ఉత్సాహంగా పాల్గొన్న తమ్ముడు గుండెపోటుకు గురై మృతిచెందాడు.స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం తాళ్లపల్లితండా వద్ద గల శంకర్ తండాకు చెందిన నీతా పెళ్లి సోమవారం కౌడిపల్లి మండలం బుర్గుగడ్డకు చెందిన మేనబావతో శంకర్ తండాలో నిర్వహించారు. సాయంత్రం తండాలో బారాత్ నిర్వహించి అప్పగింతల కార్యక్రమం అనందంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురైయ్యాడు. కొద్దిసేపు సేదతీరిన అనంతరం మాములు స్థితికి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
మళ్లీ ఛాతిలో నొప్పిగా ఉందని స్నేహితులతో చెప్పడంతో కౌడిపల్లిలోని హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు నర్సాపూర్ వెళ్లాలని సూచించారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంతో అప్పటికే యువకుడు నరేందర్ మృతిచెందాడు. నరేందర్ తుప్రాన్లోని ఓ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శంకర్ తండాలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.