రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ త్వరలో శుభవార్త చెప్పనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచే వయసు పెంపు అమల్లోకి రానున్నట్లు సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఉద్యోగుల పదవీ విరమణ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. అయితే రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచాలా..? లేదంటే 60కి పెంచితే సరిపోతుందా..? అనే అంశంపై కేసీఆర్ ఉన్నాతాధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న 26వేల మందికి పైగా ఉద్యోగులు వచ్చే మూడేళ్లలో రిటైర్ అవుతున్నారు. వారంతా సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు పదవీ విరమణ చేస్తే వారికి ఇచ్చే గ్రాట్యుటీతో పాటు ఇతర బెనిఫిట్స్ కల్పించాల్సి ఉంటుంది. ఐతే రిటైర్మెంట్ వయసు పెంచితే ప్రస్తుతానికి ఇవన్నీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. తద్వారా రాబోయే మూడేళ్లలో ఏటా రూ.3500 కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలావుంటే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే నోటిఫికేషన్లు లేక ఇబ్బందులు పడుతూంటే.. మళ్లీ పదవీ విరమణ వయసు పెంపు ఏంటనీ ప్రశ్నిస్తున్నారు.