తండ్రికి బిడ్డకు మధ్య అనుబంధం విషాదాంతంగా ముగిసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఓ కూతురు కూడా అర్ధాంతరంగా తనువు చాలించింది.. ప్రమాదంలో తండ్రి చనిపోవడంతో... ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటిపల్లిలో చోటు చేసుకుంది. ఆరవెల్లి సాయిప్రియ అనే యువతి మంచిర్యాల జిల్లా కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. సాయిప్రియ తండ్రి వసంత్ సోమవారం మంచిర్యాల నుంచి చెన్నూరుకు వస్తుండగా జైపూర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. వసంత్ను కుటుంబ సభ్యులు కరీంనగర్కు తరలించి వైద్యచికిత్స అందిస్తుండగా మృతిచెందారు. తండ్రి మృతదేహాన్ని అంబులెన్సులో చెన్నూరుకు తీసుకొస్తుండగా వెనుక కారులో సాయిప్రియ తన అక్కాచెల్లెళ్లతో కలిసి కూర్చొంది. కారు గోదావరి వంతెన మీదకు చేరుకోగానే.. వాంతి వస్తోందంటూ కారు ఆపాలని కోరింది. అందులోంచి దిగిన వెంటనే నదిలోకి దూకేసింది..ఓ వైపు తండ్రి మృతదేహం... మరోవైపు చెల్లెలు ఆత్మహత్యతో... కళ్లముందే జరిగిన ఈ అనూహ్య సంఘటనకు కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. ఆమె ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.