రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి ‘కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్’ ఆప్షన్ ఎంచుకుంటే.. పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ఒకేసారి చెల్లిస్తారు. మిగతా మొత్తం పెన్షన్ రూపంలో అందజేస్తారు. అయితే ఇక్కడ పెన్షన్ మొత్తం తగ్గుతుంది. ఉదాహరణకు మీకు నెలకు రూ.35,000 పెన్షన్ వస్తోందనుకుంటే.. కమ్యూటేషన్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు రూ.29,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు కొత్త ప్రతిపాదనకు ఆమోదం వల్ల పెన్షన్ పూర్తి విలువను 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే 15 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్తి పెన్షన్ పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెన్షన్ కమ్యుటేషన్ పునరుద్ధరణ నిర్ణయం కేవలం కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. 2008 సప్టెంబర్ 26కు ముందు పదవీ విరమణ చేసిన వారికే ఈ కొత్త ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. అలాగే వీరు రిటైర్మెంట్ సమయంలో కమ్యుటేషన్ ఆప్షన్ ఎంచుకొని ఉండాలి. దాదాపు 6.3 లక్షల మంది ఈ ఆప్షన్ ఎంచుకున్నారు. అంటే ఇప్పుడు వీరిందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఎక్కువ పెన్షన్ వస్తుంది. ఇకపోతే పెన్షన్ కమ్యుటేషన్ పునరుద్ధరణ అంశానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) గత ఏడాదిలోనే ఆమోందం తెలిపింది. 2019 ఆగస్ట్ 21న జరిగిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ మీటింగ్లో ఈపీఎఫ్వో దీనికి ఓకే చెప్పింది.