ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గులాబీ నేతల్లో రాజ్యసభ టెన్షన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2020, 01:44 PM

తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రెండు కూడ గులాబీ పార్టీకే దక్కనున్నాయి. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల్లో రాజ్యసభ టెన్షన్ మొదలైంది. ఉన్నవి రెండే సీట్లు కావడంతో ఆశావాహుల సంఖ్య కూడ పెద్దదిగానే ఉంది. అయితే పార్టీ అధినేత కేసీఆర్ ఎవరి వైపు మొగ్గుచూపుతారోనన్న ఆందోళన మాత్రం నేతల్లో ప్రారంభమైంది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు పదవీకాలం ముగియబోతుంది. అయితే కేకే కు మరోసారి ఎక్స్ టెన్షన్ ఉండే అవకాశాలు లేవని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేకే స్థానంలో కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవితను రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది.
రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో అధికార టీఆర్ఎస్ కు చాలా గ్యాప్ వచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టేందుకు సరైన ఎంపీ లేడని కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో గతంలో ఎంపీగా పనిచేసి కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న కవితను పెద్దలసభకు పంపేందుకే గులాబీ బాస్ మొగ్గుచూపుతున్నారట. ఇదే జరిగితే ఇక మిగిలింది ఒకే ఒక్క సీటు మాత్రమే. ప్రస్తుతం రాజ్యసభలో టీఆర్ఎస్ బలం ఆరుగురు. వీరిలో ఎస్సీ, ఎస్టీతో పాటు తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గానికి చోటు లభించలేదు. దీంతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారట.
గతంలో వైసీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి మారిన రాజకీయ పరిస్థితుల్లో గులాబీ గూటికి చేరారు. అయితే గత ఎన్నికల్లో నామా నాగేశ్వర్రరావుకు టీఆర్ఎస్ ఎంపీ సీటు ఇచ్చినప్పటకి ఆయన గెలుపు కోసం ప్రయత్నించారు. దీంతో పాటు తనకు రాజకీయ భిక్షపెట్టిన ఏపీ సీఎం జగన్ ఆశీస్సులు పోంగులేటికి ఉన్నాయనే ప్రచారం జరుగుతోది. దీంతో తనకు రాజ్యసభ బెర్త్ కన్ ఫమ్ అయిందని తన సన్నిహితుల వద్ద పొంగులేటి చెబుతున్నారట. ఇక ఎన్నికల ముందు గులాబీ గూటికి చేరిన మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి కూడ కేటీఆర్ ద్వారా పైరవీ నడుపుతున్నట్లు సమాచారం. రాజ్యసభ హామీతోనే సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారనే ప్రచారం నడుస్తోంది. వీరిద్దరితో పాటు నాయిని నరసింహారెడ్డి కూడ తన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవల నాయిని చేసిన వ్యాఖ్యలు గులాబీ దళపతి ఆగ్రహాం తెప్పించాయనే టాక్ వినిపిస్తోంది.
ఇక మాజీ స్పీకర్ మధుసూదన చారి కూడ రాజ్యసభ కోసం ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే మధుసూధన చారి గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. మృదుస్వభావి కావడంతో పాటు వివాదరహితుడిగా పేరు ఉండటం మాజీ స్పీకర్ కు కలిసి వచ్చే అంశమని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. వీరితో పాటు మాజీ మంత్రులు తుమ్మల, కడియం శ్రీహరి, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ లు కూడ ప్రయత్నాలు చేస్తున్నారట. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా.. కేసీఆర్ మదిలో ఏముందో అంతుపట్టడం లేదు. గతంలో రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు కలలో కూడ ఊహించని వారిని రాజ్యసభకు పంపి గులాబీ బాస్ నేతలకు షాక్ ఇచ్చారు. దీంతో ఈ సారి సీఎం కేసీఆర్ ఎలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకుంటాడో వేచి చూడాలి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com