ప్రియుడి మోజులో పడిన మహిళ ప్రియునితో కలిసి భర్తను హత్య చేయించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మారం వెంకట్ రెడ్డికి నల్లగొండ మండలం పానగల్ గ్రామానికి చెందిన చాపల స్రవంతితో 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. వెంకట్ రెడ్డికి వివాహానికి ముందు నుంచే చోరీలు చేసే అలవాటు ఉంది. పెళ్లైన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు లేదు. డ్రైవర్ పని కూడా చేసేవాడు. అలా అతని పై దాదాపు 40 కేసులు నమోదయ్యాయి. స్రవంతి తన స్కూల్ రోజులలో ఆమె గ్రామానికి చెందిన మున్నా శేఖర్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో అప్పట్లో ఇంట్లో వారు వారి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో స్రవంతి బలవంతంగా వెంకట్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. వెంకట్ రెడ్డి ప్రవర్తనతో విసిగిపోయిన స్రవంతి శేఖర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వెంకట్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో స్రవంతి ఇంటికి శేఖర్ వచ్చి వెళ్లేవాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా వెంకట్ రెడ్డికి తెలిసింది. ఇద్దరి మధ్య గొడవలు కావడంతో పెద్దమనుషులు సర్ది చెప్పారు. అయినా వెంకట్ రెడ్డి స్రవంతిని వేధించాడు. దీంతో స్రవంతి నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మళ్లీ పోలీసులు,పెద్ద మనుషులు సర్ది చెప్పడంతో ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే వెంకట్ రెడ్డి నల్లగొండ సాగర్ రోడ్డులో ఉన్న మద్యం షాపులో దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. దీంతో వెంకట్ రెడ్డి జైలుకు వెళ్లాడు. వెంకట్ రెడ్డి జైల్లో ఉన్నన్ని రోజులు స్రవంతి,శేఖర్ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో వెంకట్ రెడ్డిని హతమార్చాలన్న ఆలోచన శేఖర్ కు వచ్చింది. వెంకట్ రెడ్డిని హతమారిస్తే తమకు అడ్డు ఉండదని భావించాడు. ఈ విషయం స్రవంతికి చెప్పాడు. దానికి ఆమె కూడా సరేనంది. వెంకట్ రెడ్డి మార్చి 26న డీసీఎంలో హైదరాబాద్ కు బయల్దేరాడు. మర్రిగూడు స్టేజి వద్ద శేఖర్, అతని స్నేహితులు డీసీఎంను అడ్డగించి వెంకట్ రెడ్డిని కారులో ఎక్కించుకున్నారు. పైపుల కంపెనీ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వెంకట్ రెడ్డిని శేఖర్ హతమార్చారు. స్రవంతి ఏం తెలియనట్టుగా నాటకమాడింది. వెంకట్ రెడ్డి అంత్యక్రియలు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారించి నిందితులను కనిపెట్టారు. అనంతరం తమదైన శైలిలో పోలీసులు విచారించగా నిందితులు నిజాన్ని ఒప్పుకున్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు.