కరోనాతో జీడి పరిశ్రమ కుదేలైంది. ఎగుమతులు నిలిచిపోవడంతో ఈ రంగానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. గత 12 రోజులుగా పరిశ్రమలు మూత పడడంతో పనుల్లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాలతో జోరుగా వ్యాపారం సాగాల్సిన రోజుల్లో లాక్డౌన్ కారణంగా ఎక్కడి సరుకు అక్కడే నిలిచిపోయింది. రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎగుమతికి సిద్ధమైన జీడిపప్పు కూడా ఫ్యాక్టరీల్లోనే ఉండిపోయింది. పరిశ్రమల్లో పని చేస్తున్న వేలాది కూలీలకు ఉపాధి దూరమైంది. వీరిలో అత్యధికులు మహిళలే. శ్రీకాకుళం జిల్లాలో 300 జీడి పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో వంద పరిశ్రమలు పెద్దవి. మిగిలినవి చిన్నవి. జనవరి నుంచి జూన్ వరకూ దాదాపు ఆరు నెలల పాటు సీజన్ ఉంటుంది. పెద్ద పరిశ్రమలన్నీ జనవరి నుంచే ఉత్పత్తిని ప్రారంభించాయి. లాక్డౌన్కు కొన్ని రోజుల ముందు 50 చిన్న పరిశ్రమల్లో ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. మిగిలిన 150 పరిశ్రమలు ఏప్రిల్లో జీడిపప్పును తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్తో పని చేస్తున్న, పని చేయడానికి సిద్ధమవుతున్న పరిశ్రమలు ఆగిపోయాయి. ఈ సీజన్లో రోజుకు 500 టన్నులు ప్రాసెసింగ్ అవుతుంది. తద్వారా 120 టన్నుల జీడిపప్పు వస్తుంది. రోజుకు కనీసం పది లారీల సరుకు ఎగుమతి కావాల్సి ఉందని వ్యాపారులు చెప్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, తెలంగాణకు ఇక్కడ నుంచి జీడిపప్పు ఎగుమతి అవుతుంది. పరిశ్రమల్లో టన్నుల కొద్దీ సరుకు నిల్వ ఉండిపోగా, రిటైల్ దుకాణాలకు సరుకు అవసరమున్నా పంపించలేని పరిస్థితి నెలకొంది. వినియోగదారులు లేక ఒక్కో వ్యాపారి వద్ద 400 నుంచి 500 టన్నుల జీడిపప్పు ఉండిపోయింది. ప్యాకింగ్ చేయకుండా పది రోజుల పాటు జీడిపప్పు ఉంటే వినియోగానికి పనికి రాదని వ్యాపారులు చెప్తున్నారు. పరిశ్రమల్లో పని చేస్తే రోజుకు రూ.300 నుంచి రూ.400 ఆదాయం వచ్చేది. ప్రస్తుతం పూట గడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం జీడి కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.