కరోనా ప్రభావంతో తెలంగాణ సర్కార్ పాలనలో పలు కీలక మార్పులు చేయాలని భావిస్తునట్టు సమాచారం. సెక్రటేరియట్ నుంచి గ్రామ స్థాయి ఆఫీసుల వరకు అంతా డిజిటల్ మయం చేయాలని చూస్తునట్టు తెలుస్తోంది. పేపర్ లెస్ పరిపాలన అందించే దిశగా తెలంగాణ సర్కార్ గతంలోనే ముందడుగు వేసింది. కానీ అది అన్ని శాఖలలో సాధ్యపడలేదు. కరోనా ప్రభావంతో మనుషులు గుంపులుగా ఉండే పరిస్థితి లేదు. అందుకే పేపర్ లెస్ పాలన అందించేందుకు కృత నిశ్చయంతో సర్కార్ ముందుకు సాగుతునట్టు తెలుస్తోంది. సర్కార్ తన ఆలోచనను అమలు చేయడం కోసం ఓ యాప్ తేనుంది. ఈ యాప్ లోనే అన్ని శాఖలు ఉంటాయి. ప్రతి శాఖకు సంబంధించి ప్రత్యేక ఐడీలు,పాస్ వర్డ్ లు ఇవ్వనున్నారు. ఉద్యోగులకు కూడా ఐడీలు,పాస్ వర్డ్ లు ఇస్తారు. అంతా ఈ యాప్ ద్వారానే పని చేస్తారు. యాప్ పై ఒత్తిడి పెరిగి క్రాష్ అయ్యే అవకాశం ఉంది కావున అలా జరగకుండా భారీ ఎత్తున సర్వర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఫైలుకు సంబంధించి ఓ బార్ కోడ్ ఇస్తారు. ఆ బార్ కోడ్ ద్వారా ఆ ఫైల్ పని ఎంత వరకు పూర్తయ్యిందో కూడా తెలుసుకోవచ్చు. దీంతో ఇక అంతా ఆన్ లైన్ ద్వారానే జరగనుంది. ప్రస్తుతం మీసేవలు,ఈ సేవల ద్వారా పలు సర్టిఫికెట్టు పొందుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా ట్రాఫిక్ చలాన్లు,కరెంట్ బిల్లులు కూడా ఆన్ లైన్ లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు,సమావేశాలు,చర్చలు,పథకాల ప్రారంభం అంతా ఆన్ లైన్ ద్వారానే చేయనున్నారు. సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తున్నా ఇది ఆచరణలో విజయవంతం అవుతుందో లేదో చూడాలి.