70 ఏళ్ల వృద్దుడు మనవరాలి వయస్సున్న బాలిక పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా నత్నాయిపల్లి గ్రామానికి చెందిన రుద్రయ్య 12 సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి జిన్నారం మండలం కిష్టాయిపల్లికి వలస వచ్చాడు. రుద్రయ్య కూతురికి 14 సంవత్సరాలు. పేద కుటుంబం కావడంతో ఆమెను చదివించకుండా పనిలో పెట్టాడు. కిష్టాయిపల్లికి చెందిన 70 ఏళ్ల వృద్దుడు బషెట్టిగారి దయానంద్ ఇంట్లో బాలిక పనికి కుదిరింది. దయానంద్ తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరు నెలలగా ఈ తతంగం సాగించాడు. వారం రోజుల క్రితం బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి,వాంతులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలిక గర్భవతి అని తేలింది. బాలికను తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. దీంతో దారుణం బయటపడింది. బాలిక తండ్రి బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.