తెలంగాణలో రెండు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. యాదాద్రి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అటు.. ఏపీలోనూ రాబోయే 24 గంటల్లో రాయలసీమలో ఎక్కువ చోట్ల, కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మరో రెండురోజులు ఇదే వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది.