కరోనా వైరస్ ను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి మొద్దు నిద్ర నుండి బయటికి రావాలని, రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నా, సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు. కరోనా, లాక్ డౌన్ ల వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల పైన ఉన్న ప్రేమ, పేద మధ్య తరగతి కుటుంబాల పై ఎందుకు లేదని ప్రశ్నించారు. స్కూళ్ళు, యూనివర్సిటీలు, పబ్బులు, బార్లు, సినిమా థియేటర్లు మూసివేశారు, కానీ నిత్యం వేలాది మంది వచ్చి వెళ్లే వైన్ షాపులు ఎందుకు మూసివేయాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా కరోనా టెస్టులు నిర్వహించాలని, కరోన టెస్టులను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.