హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా వాహనాలు వస్తున్నాయి. హైదరాబాద్లో లాక్డౌన్ విధిస్తారని తెలియడంతో పాటు... వైరస్ ఎక్కువగా ఉండటంతో ఏపీవాసులంతా తమ స్వరాష్ట్రానికి చేరుకుంటున్నారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై గరికపాడు చెక్ పోస్టు వద్దకు భారీగా వాహనాలు చేరుకున్నాయి. స్పందన యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏపీ వాసులు వస్తున్నారు. ఎటువంటి రిజిస్ట్రేషన్, పాస్ లేకుండా వస్తున్న వారిని పోలీసులు అనుమతించడం లేదు. హైదరాబాదులో కరోనా ఎక్కువగా ఉందని, లాక్డౌన్ పెట్టబోతున్నారని అందుకే వస్తున్నామని వాహనదారులు చెబుతున్నారు. తమని ఏపీలోకి అనుమతించాలని పోలీసులను ప్రాథేయ పడుతున్నారు. పాసు లేకుండా అనుమతించబోమని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకే అనుమతిస్తామని ఇప్పటికే ఏపీ పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.