నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో రెండు, మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురేసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈ వానాకాలం సీజన్లో నారు మళ్లను సిద్ధం చేసుకుని, విత్తనాలు చల్లేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండగా, మరో వైపు ఒరిస్సా నుంచి కోస్తా ఆంధ్రా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీంతో తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయల సీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.