ఆయన ఒక పోలీస్ అధికారి. వలస కార్మికుల పిల్లలు ఆన్లైన్ చదువులకు దూరం కావడం చూసి చలించిపోయారు. దీంతో ఆయనే ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. రోజు పోలీస్ డ్యూటీకి వెళ్లే ముందు ఉదయం వేళ కొంతసేపు వారికి చదువు చెబుతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్లో సబ్ ఇన్స్స్పెక్టర్ శాంతప్ప జడేమనవర్ ఉంటున్నారు. కాగా, కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ నెల వచ్చినా దేశవ్యాప్తంగా స్కూళ్లు ఇంకా తెరువలేదు. అయితే కర్ణాటకతోపాటు కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే ఆ ప్రాంతంలోని వలస కూలీల పిల్లలకు స్మార్ట్ఫోన్లు, టీవీలు లేక ఆన్లైన్ విద్యకు దూరమవుతున్నారు.ఎస్ఐ శాంతప్ప దీనిని గ్రహించారు. ఆ పిల్లల చదువు కోసం ప్రతి రోజు కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. రోజూ డ్యూటీకి వెళ్లే ముందు వారికి పాఠాలు బోధిస్తున్నారు. వలస కూలీల పిల్లలకు కూడా చదువుకునే హక్కు ఉన్నదని ఆయన అన్నారు. ఆన్లైన్ విద్యకు వారు దూరం కావడం వారి తప్పుకాదని చెప్పారు. తల్లిదండ్రులతోపాటు వారు కూడా కూలీ పనులకు వెళ్లడాన్ని తాను సహించబోనని చెప్పారు. దీంతో ప్రతిరోజు ఆ పిల్లల కోసం కొంత సమయం కేటాయించి చదువు చెబుతున్నానని తెలిపారు. ఇది కూడా తన బాధ్యతని, వలస కూలీల పిల్లలకు చదువు చెప్పడం ఎంతో సంతృప్తినిస్తున్నదని ఎస్ఐ శాంతప్ప చెప్పారు.