కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సవాల్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. నిన్న శాసనసభలో డబుల్ బెడ్ రూం ఇండ్లపై చర్చ సందర్భంగా ఇద్దరి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు గుర్తుకు వస్తాయని, నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎక్కడ కట్టారో తెలుపాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని అడిగారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల వివరాలు పూర్తిగా వివరిస్తామని తలసాని తెలిపారు.
ఈ క్రమంలో ఇవాళ ఉదయం బంజారాహిల్స్లోని భట్టి విక్రమార్క నివాసానికి మంత్రి తలసాని, ఎమ్మెల్యే వివేకానంద, మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లారు. అక్కడ్నుంచి విక్రమార్కను తీసుకుని జియగూడలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల పరిశీలనకు బయల్దేరారు.
హైదరాబాద్పై 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014-2020 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చును మంత్రి కేటీఆర్ నిన్న అసెంబ్లీ వేదికగా వివరించిన విషయం తెలిసిందే. గత ఆరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.67,135 కోట్లను క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా వివిధ రూపాల్లో ఖర్చు చేసిందని, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా కలిపితే రూ.లక్ష కోట్లు దాటుతుందని చెప్పారు. కాంగ్రెస్ పదేండ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో రూ.4,636 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేండ్లలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ.32,533 కోట్లు ఇచ్చిందని తెలిపారు. పేదవారిపై ఒక్క రూపాయి భారం పడకుండా సుమారు రూ.10వేల కోట్లతో ఇండ్లు కట్టిస్తున్నామన్నారు. లక్ష ఇండ్లను డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నా.. కాంగ్రెస్ పార్టీ వారికి కనిపించడం లేదని విమర్శించారు.