ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ... డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. గతంలో ఒక రూమ్లో 40 మందిని కూర్చోబెట్టి పరీక్ష నిర్వహించే వాళ్ళమని... ఇప్పుడు 20 మందినే కూర్చో బెట్టనున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థికి మధ్యలో ఒక బెంచ్ ఖాళీగా ఉంటుందని తెలిపారు. ఏ కాలేజీలో చదివిన వాళ్లకు ఆ కాలేజీలోనే పరీక్ష నిర్వహిస్తామని ఆయన అన్నారు. పరీక్ష రాయలేని వాళ్లకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహిస్తామని.. సర్టిఫికేట్లో మాత్రం రెగ్యులర్ అనే వస్తుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి మాస్క్ ధరించి పరీక్షకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆరు యూనివర్సిటీలలో కలిపి లక్షన్నర మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని... ఒక వేళ బ్యాక్ లాగ్స్ ఉంటే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని పాపిరెడ్డి వెల్లడించారు.