వికారాబాద్ జిల్లాలో కురిసిన వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. బుధవారం సాయంత్రం ఇద్దరు కూతుళ్లను పట్టుకొని ఓ తల్లి వాగు దాటుతున్న క్రమంలో కొట్టుకుపోయింది. కూతుర్లు ప్రాణాలతో బయటపడినా కన్నతల్లి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ హృదయ విధారక ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మర్పల్లి మండల పరిధిలోని షాపూర్తండాకు చెందిన దశరథ, అనితాబాయికి 15ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఐదుగురు సంతానం. బుధవారం ఉదయం పత్తి చేనులో కలుపు తీయడానికి దశరథ, అనితాబాయితో పాటు ఐదుగురు పిల్లలు, మరో ముగ్గురు స్థానికులు కలిసి మొత్తం 10మంది ఆటోలో వెళ్లారు. పని ముగించుకొని సాయంత్రం 4గంటలకు తిరిగివచ్చే క్రమంలో షాపూర్తండా సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కొద్దిసేపు అక్కడే ఉన్నారు. కానీ ఇంతలోనే ఇంటి దగ్గర పని ఉంది వెళ్దామని భర్త దశరథకు చెప్పడంతో వాగు దాటేందుకు కదిలారు. తండ్రి చేయి పట్టుకొని కుమారులు వాగు దాటగా.. ఆ తర్వాత కుమార్తెలు వీణాబాయి, బబ్లూబాయిలు తల్లి చేతులు పట్టుకొని దాటుతుండగా వరద ధాటికి కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన దశరథ వాగులో ఈదుకుంటూ వెళ్లి కుమార్తెలను వాగుకు చేర్చాడు. ఇంతలోనే అనితబాయి దూరంగా కొట్టుకుపోవడంతో స్థానికులు తాడు సాయంతో వెతికి బయటకు తీసుకురాగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.