తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై శాసనసభ వేదికగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నగరంలో లక్ష ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్తున్నారు.. కానీ చూపించడం లేదు. ఆ ఇండ్లను చూపించాలని శాసనసభలో భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి తలసాని స్పందిస్తూ.. మీరు వస్తే ఇండ్లను చూపిస్తాం. అప్పుడు అభివృద్ధి కనబడుతుందన్నారు. మొత్తానికి భట్టి విసిరిన సవాల్ను తలసాని స్వీకరించారు. గురువారం ఉదయం బంజారాహిల్స్లోని భట్టి నివాసానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లి డబుల్ బెడ్ రూం ఇండ్ల పరిశీలనకు బయల్దేరారు. కొన్ని ప్రాంతాల్లో ఇండ్లను పరిశీలించిన అనంతరం భట్టి విక్రమార్క, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి మీడయాతో మాట్లాడారు.
లక్ష ఇండ్లు చూపించి తీరుతాం : మంత్రి తలసాని
పేద వర్గాలు ఉన్నతంగా బతకాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి తలసాని తెలిపారు. నగరంలో మొత్తం 60 చోట్ల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నామని, వాటిలో కొన్నింటిని మాత్రమే ఇవాళ చూశామన్నారు. భట్టి విక్రమార్కకు లక్ష ఇండ్లు చూపించి తీరుతామని స్పష్టం చేశారు. ఈ ఇండ్లను పేదలకు ఉచితంగా కట్టించి ఇస్తున్నామని చెప్పారు. బస్తీల సమక్షంలోనే ఇండ్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదని తేల్చిచెప్పారు. లక్ష ఇండ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు ఖర్చు పెడుతుందన్నారు. కొల్లూరులో 15 వేల ఇండ్లు నిర్మించాం. అవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఈ ఇండ్లను పూర్తి చేసి పేదవారికి పంపిణీ చేయాలని ప్రభుత్వం ముందుకెళ్తుంది. లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు. డిమాండ్ ఉన్న చోట భవిష్యత్లో ఇలాంటి ఇండ్లను నిర్మిస్తామన్నారు. ఏ పార్టీలైనా పేదల సంక్షేమమే కోరుకుంటుందని మంత్రి తలసాని చెప్పారు.
3,428 ఇండ్లను చూశాం : భట్టి విక్రమార్క
రాష్ర్ట ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఇవాళ 3,428 ఇండ్లను చూశామని, వీటిలో కొన్ని పూర్తికాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. లక్ష ఇండ్లు సిద్ధమయ్యాయి అని ప్రభుత్వం చెప్పడంతో చూద్దామని సభలో అన్నాను. ఆ ప్రకారమే ఇండ్ల నిర్మాణాలను పరిశీలించాం. రేపు కూడా మిగతా ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలిస్తామని ఆయన చెప్పారు.