కరోనా విజృంభణ కారణంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాలతో పాటు విద్యారంగం కూడా నష్టపోయింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని స్కూళ్ళు, కాలేజీలను తెరవలేదు. దాంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. సిలబస్ నుండి 30శాతం సిలబస్ ను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నష్టపోయిన పని దినాలకు అనుగుణంగా సిలబస్ ను బోధించనున్నారు. సిబిఎస్సి సిలబస్ లో కోత విధించిన దానికి అనుగుణంగా రాష్ట్ర సిలబస్ లో కోత విధించనున్నారు. దాంతో నీట్, జెఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా నిర్ణయం తీసుకున్నారు.ఇక ప్రతి ఏడాది పనిదినాలు 222 ఉంటే..ఈ ఏడాది 40 రోజులు తగ్గించి 182 రోజులకు పరిమితం చేసారు. తొలగించిన సిలబస్ వివరాలను తెలంగాణ ఇంటర్ బోర్డు త్వరలో ప్రకటించనుంది. అంతే కాకుండా మార్చిలో జరిగిన వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించి, పలు కారణాలతో పరీక్షలు రాయని 27వేల మంది విద్యార్థులను కూడా పాస్ చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబందించిన ఉత్తర్వులు త్వరలో విడుదల చేయనున్నారు.