పేద దేశాల్లో క్రైస్తవ మిషనరీలు అందిస్తున్న సేవలు మరువలేనివి అని రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నగరంలోని బంజారాహిల్స్లో బిషప్లు, క్రైస్తవ ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. క్రైస్తవ మిషనరీలు కొన్ని దశాబ్దాలుగా విద్య, వైద్య రంగంలో ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎక్కడ విపత్తులు సంభవించినా సేవలు అందించడానికి క్రైస్తవ సమాజం ముందు ఉంటుందన్నారు. విపత్తుల వేళ కూడా విశేష సేవా, సహాయం అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హిందూ ధర్మాన్ని బలంగా నమ్ముతారు. అదే సమయంలో ఇతరుల నమ్మకాలను కూడా గౌరవిస్తారు. రాష్ర్టంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. స్వరాష్ర్టంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం 940 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ గురుకులాల్లో 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. క్రైస్తవ సమాజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
అభివృద్ధి అనేది సమగ్రంగా, సమ్మిళితంగా ఉండాలనేది తమ అభిమతమని కేటీఆర్ స్పష్టం చేశారు. చైనా కంటే మనం వెనుకబడి ఉన్నామని తెలిపారు. మౌలిక వసతుల కల్పన లేకుండా ఎంత అభివృద్ధి జరిగినా అది వృథా అవుతుందన్నారు. ఇన్నోవేషన్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ జీఎస్డీపీ ఆరేళ్లలోనే రెట్టింపు అయిందన్నారు. తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని కేటీఆర్ తెలిపారు.