మహబూబాబాద్లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని అండర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముగ్గు వేసి అందులో నిమ్మకాయలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ వంటివి ఉండటంతో.. ఎవరో మాంత్రికులు క్షుద్రపూజలు చేసి ఉంటారని భావిస్తున్నారు. అక్కడికి చేరుకుని వాటిని పరిశీలించిన స్థానికులు, అమావాస్య అర్థరాత్రి సమయంలో ఈ పూజలు చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మెయిన్ రోడ్ పక్కనే ఇలా చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఇటువంటి పూజలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయని, ఇలాంటి పనులు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఆకాశంలో అద్బుతాలు చేసే స్థాయికి ఎదిగాం, కానీ ఈ మూఢనమ్మకాలు మాత్రం దూరం చేయలేకపోతున్నాం. మాయలతో, మంత్రాలతో గుప్తనిధలు దొరకవు. ఎదుటివ్యక్తులు మీ వశం అవ్వరు. ఇలాంటి పనులు చేసేవారిని నమ్మితే చివరికి మోసపోవడం ఖాయం.