రూ.లక్షల్లో నగదు దోచుకుంటే జీవితంలో సెటిలవ్వొచ్చనే దురాశకు లోనయ్యాడు ఓ ఏటీఎం క్యాష్ డిపాజిటర్. తన సహచరునితో కలిసి ఏటీఎంలో డబ్బు చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా కొమ్మరోలు మండలంలోని బసువుపల్లికి చెందిన చీదర్ల వినయ్(22) ఉప్పల్లోని శాంతినగర్లో ఉంటూ ఈస్ట్ మారేడ్పల్లిలోని ఓ సెక్యూరిటీ సంస్థలో ఏటీఎం సెంటర్లలో నగదు జమ చేసే కస్టోడియన్గా పనిచేస్తున్నాడు. బేగంపేటలోని మరో సంస్థలో ఇదే పనిచేసే కొండా రాఘవేందర్గౌడ్(22)తో దోస్తీ చేశాడు. లాక్డౌన్ వల్ల ఆరునెలల క్రితం రాఘవేందర్గౌడ్ పని మానేసి స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లాలోని లింగాల గ్రామానికి వెళ్లాడు. వినయ్ సైతం ఆ ఉద్యోగం వదిలేసి 20 రోజుల క్రితం సికింద్రాబాద్లోని సెక్యూర్ వ్యాల్యూ ఇండియా సంస్థలో కస్టోడియన్గా చేరాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రాఘవేందర్ తిరిగి వినయ్ను కలిశాడు. ఇద్దరూ ఏటీఎంలో జమ చేసిన సొమ్మును చోరీ చేయాలని పథకం వేశారు. వినయ్ ఈనెల 11వ తేదీ రాత్రి 11.30 గంటలకు ప్రధాన కస్టోడియన్తో కలిసి హయత్నగర్ సమీపంలోని బొమ్మలగుడి వద్ద వున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో రూ.13లక్షలు నగదు జమ చేశాడు. మరుసటి రోజు ప్రధాన కస్టోడియన్ ద్వారా ఏటీఎంలో నగదు జమ చేసే కాంబినేషన్ పాస్వర్డ్ను తెలుసుకున్నాడు. ఆ పాస్వర్డ్ను రాఘవేందర్గౌడ్కు తెలిపాడు. దీని సాయంతో 13వ తేదీ తెల్లవారుజామున ముఖానికి మాస్కు కట్టుకున్న రాఘవేందర్.. ఆ ఏటీఎంలో రూ.9లక్షలు చోరీ చేసి పరారయ్యాడు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీని పరిశీలించిన హయత్నగర్ పోలీసులు... దర్యాప్తు ప్రారంభించి గురువారం రాఘవేందర్ను అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో వినయ్ను అరెస్టు చేశారు. వారు దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో చొరవ చూపిన పోలీసులను డీసీపీ అభినందించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ శంకర్, హయత్నగర్ సీఐ సురేందర్, డీఐ నాగార్జున, ఎస్సై నర్సింహ, సిబ్బంది పాల్గొన్నారు.