దేశం కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తూ కరోనాతో మృతిచెందిన సైనికుల కుటుంబాలకు ‘భారత్ కే వీర్’ నిధుల నుంచి అదనంగా మరో రూ.15 లక్షల సాయం అందించాలని ప్రధాని మోడీని ఎంపీ రేవంత్రెడ్డి కోరారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. రేవంత్ గురువారం లేఖ రాశారు. కరోనాతో మృతిచెందిన సైనికులకు సాయం అందించాలనే అంశాన్ని అందులో ప్రస్తావించారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (CAPF)లో 25,418 మందికి పాజిటివ్ సోకడం.. సుమారు 100మంది చనిపోవడం బాధ కలిగిందన్నారు. భారత సైన్యంలో 16,728, నావికాదళంలో 1,365, వాయుసేనలో 1,716 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. త్రివిధ దళాల్లో మొత్తంగా 35మంది మృతి చెందారనే విషయం తనను ఎక్కువగా బాధించినదని పేర్కొన్నారు. సీఏపీఎఫ్ సిబ్బందిలో కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు సాధారణ ప్రయోజనాలతో పాటు రూ.15 లక్షలు అదనంగా ‘భారత్ కే వీర్’ నిధుల నుంచి ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన పారిశుధ్య కార్మికులు, ఫ్రంట్ లైన్ కార్మికులు మృతి చెందితే వారి కుటుంబాలకు కనీసం రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని రేవంత్ కోరారు.