షాద్ నగర్ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టిస్తూ రెచ్చిపోతున్నారు. సీసీ కెమెరాలు తొలగించి చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. గత నాలుగు రోజుల వ్యవధిలోనే మహబూబ్ నగర్ రోడ్డులో సుమారు 8 షాప్ లలో పరిగి రోడ్డులోని మూడు ఇళ్లలో ఓ కలశాలలో సీసీ కెమెరాలను తొలగించి దొంగతనాలకు పాల్పడ్డారు. దీంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణం మొత్తం సీసీ కెమెరాలు ఉన్న వాటిని కొన్నిచోట్ల ఏ మాత్రం లెక్క చేయడం లేదు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అవుతున్న ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు సీసీ కెమెరాలు కొన్ని చోట్ల ఉన్న అవి పని చేయడం లేదు. ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాల ఏర్పాటులో భాగంగా కొంతమంది ప్రజా ప్రతినిధులు వ్యాపార వేత్తలు ప్రముఖులు చెక్కు రూపంలో నగదు రూపంలో సీసీ కెమెరాలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశారు. కానీ వాటిపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఫలితం శూన్యంగా మారుతుంది. గతంలో సాయంత్రం అయితే చాలు పట్టణం మొత్తం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ అనుమానితులుగా కనిపించే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఘర్షణలతో పాటు దొంగతలనకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపారు. ఎక్కడ ఏం జరిగిన క్షణాలలో అక్కడికి వెళ్లి సీరియస్ గా వ్యవహరించారు. దాంతో పట్టణంలో ఘర్షణలతో పాటు దొంగతనాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కానీ మళ్ళీ ప్రస్తుతం షాద్ నగర్ పట్టణంలో దొంగల భయంతో జనాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో కూడా ఇలా జరగడంపై పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.