హైదరాబాద్ – లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లపై టీఆర్ఎస్ ,కాంగ్రెస్ కు మధ్య వార్ కొనసాగుతుంది. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ళు కట్టాం చూడండని రాష్ట్ర ప్రభుత్వం లిస్ట్ ఇచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నాంపల్లిలో 1824, జూబ్లిహిల్స్ లో 226 ఇళ్లు కట్టినట్లు లిస్ట్ లో ఉందన్నారు. కానీ నాంపల్లిలో ఒక్క ఇళ్ళు కూడా కట్టలేదని తనతో వస్తే చూపిస్తానన్నారు. టీఆర్ఎస్ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రజలని కాపాడవలసిన బాధ్యత తమపై ఉందన్నారు. 24 నియోజకవర్గాలలో 2 లక్షల 40 వేల ఇళ్ళు కట్టాలన్నారు. ఒక శాసన సభ పరిధిలో 10 వేల ఇళ్ళు కడుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు ఎన్ని కట్టారో ప్రభుత్వం లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.
గాంధీ భవన్ దగ్గర పేదల ఇండ్లను కూల్చిన ఘనత కాంగ్రెస్ నేతలది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్లోని కమలానగర్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తుంటే కాంగ్రెస్ నేతలు కోర్టులో కేసు వేశారు అని గుర్తు చేశారు. నాంపల్లిలో మేం కట్టింది ఒకదగ్గర.. మీరు చూసింది మరో దగ్గర అని తెలిపారు. జీహెచ్ఎంసీలో ఎక్కడ ఇండ్లు కడుతున్నామో తెలుసుకుని వెళ్లాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. హైదరాబాద్లో లక్ష ఇండ్లు ఉన్నాయి.. మీకు జాబితా ఇచ్చామని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్లపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలకు అర్హత లేదని తేల్చిచెప్పారు. పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్న రాష్ర్టం దేశంలో మరొకటి లేదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి 150 మంది అభ్యర్థులు ఉన్నారా? అని భట్టిని మంత్రి తలసాని ప్రశ్నించారు.