టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఓట్లు అడగడానికి వస్తున్న టీఆర్ఎస్ నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. హైదరాబాద్ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్న హామీ ఏమైంది?, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ ఏమయ్యింది? అని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తారనే గతంలో ప్రజలు టీఆర్ఎస్కు ఓటేశారని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఎక్కడ కట్టారు? ఎవరికిచ్చారు? అని ప్రశ్నించారు.
రోడ్లపై గుంత చూపిస్తే రూ.వెయ్యి ఇస్తామని గతంలో టీఆర్ఎస్ ఛాలెంజ్ చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు గుంతలేని రోడ్లు చూపిస్తే తాను రూ.లక్ష ఇస్తానన్నారు. హైదరాబాద్ సముద్రంగా మారడానికి ఈ ప్రభుత్వం కారణం కాదా? అని ప్రశ్నించారు. వరదల వల్ల దాదాపు 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వేగంగా జరుగుతున్న మెట్రో పనులను అడ్డుకున్నారని చెప్పారు. గతంలో కంటే ఈసారి బీజేపీపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. రేపటి నుంచి బీజేపీ ప్రచారం నిర్వహిస్తుందన్నారు.