ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ గూటికి విజయశాంతి..ముహూర్తం ఫిక్స్..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 23, 2020, 11:35 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీకి కీలక నేతలు హ్యాండిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రముఖ నటి, పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న విజయశాంతి బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 24న అంటే రేపు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఢిల్లీలో పార్టీ కేంద్ర నేతలతో ఆమె భేటీ అవుతారు.
అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇకపోతే రాములమ్మ గత కొంతకాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె పదే పదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే దుబ్బాక ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆపై తన అనుచరులతో సమావేశమైన విజయశాంతి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. విజయశాంతికి బీజేపీలో కీలకమైన బాధ్యతలనే అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇకపోతే సుమారు రెండు దశాబ్ధాల అనంతరం మరోసారి సొంత గూటికి చేరుకుంటున్నారు. సినిమాల్లో మహారాణిగా వెలుగొందుతున్న తరుణంలో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీలో చేరారు. అనంతరం తల్లి తెలంగాణ అని సొంతంగా పార్టీ పెట్టుకున్నారు.
అనంతరం తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి 2009లో మెదక్‌ ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ వాదాన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు వినిపించి.. ఉద్యమ నేతగా ఎదిగారు. అనంతర కాలంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2014లో మెదక్‌ ఎంపీగా పోటీచేసి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఘోర పరాజయం మూటగట్టకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తును ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై బహిరంగంగానే వ్యతిరేక స్వరం వినిపించారు.‌ ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉంటున్నారు. గాంధీ భవన్‌వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటంలేదు. పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని, ఏఐసీసీ కార్యదర్శి పదవి కావాలని అడిగిన తనను ఏమాత్రం పట్టించుకోవడంలేదని నేతల ముందు పలుమార్లు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com