తెలంగాణలో కరోనా పరీక్షల తీరుపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షల నిర్వహణ సరిగా లేదని పేర్కొంది. నిత్యం 50వేల పరీక్షలు చేయాలన్న ఆదేశాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారలు సరిగా అమలు చేయడం లేదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫిర్యాదులు అందిన ప్రైవేట్ ఆస్పత్రులపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో మాస్కులు, భౌతికదూరం నిబంధనలు సరిగా అమలు కావడంలేదని పేర్కొంది. జీవో 64 అమలు అధికారం పోలీసులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు కరోనా మరణాలపై ఆడిట్ కమిటీ ఏర్పాటును పరిశీలించాలని సూచించింది. కరోనా బాధితులకు ధైర్యమిచ్చేలా మానసిక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరింది. డిసెంబర్ 15 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చేనెల 17 కు హైకోర్టు వాయిదా వేసింది.