ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా తగ్గిన బంగారం ధరలు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 13, 2021, 02:20 PM

పండుగవేళ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం అవుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో కూడా బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్యులకు అందనంత దూరంలో ధరలు పెరిగిపోయాయి. బంగారం కొనాలంటే వామ్మో అనే పరిస్థితి ఉండేది. ఇటీవల కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో బంగారం రేటు పతనం అవుతోంది. బంగారం ధర ఈ స్థాయిలో పతనం అవుతున్నాయి. అయినప్పటికీ కొనాలంటేనే భయం వేస్తోంది. గత ఐదు నెలలలో బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వచ్చాయి. ఈ ఐదు నెలల్లో బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదల చూస్తుంటే షాక్ అవ్వాల్సిందే. గత ఐదు నెలల్లో బంగారం ఏకంగా రూ.8,000 పతనం కావడం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసినవారికి భారీగా నష్టాలు మూటగట్టింది. కానీ గతేడాది అంటే 2020 సంవత్సరంలో గోల్డ్ ఇన్వెస్టర్లకు 25 శాతం రిటర్న్స్ ఇవ్వడం విశేషం.
హైదరాబాద్ మార్కెట్‌లో 22క్యారట్ బంగారం 10 గ్రాముల ధర ఆగస్ట్ 7న రూ.54,200 దగ్గర ట్రేడ్ అయింది. ప్రస్తుతం ఇదే గోల్డ్ ధర రూ.46,200. ఐదు నెలల్లో బంగారం ధర ఏకంగా రూ.8,000 తగ్గింది. ఇకపోతే ఆగస్ట్ 7న హైదరాబాద్ మార్కెట్‌లో 24క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.59,130. ప్రస్తుతం 24 క్యారట్ గోల్డ్ రేట్ చూస్తే రూ.50,400. అంటే స్వచ్ఛమైన గోల్డ్ 10 గ్రాములు ఐదు నెలల్లో రూ.8,730 తగ్గింది. ఆగస్ట్ 7 వరకు రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు...ఇక అక్కడ్నుంచి పతనాన్నే చవి చూశాయి.
బంగారం ధరలు క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. మధ్యలో కాస్త పెరిగినట్టు అనిపించినా ప్రస్తుతం ధర భారీగా పతనం అవుతోంది. బంగారం మాత్రమే కాదు వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఆగస్ట్ 7న హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.76,510 వరకు చేరింది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.70,700. రికార్డు స్థాయి నుంచి రూ.5810 ధర తగ్గింది. యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం కారణంగా బంగారం ధరలు తగ్గాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీంతో పాటు ఇటీవల బిట్‌కాయిన్ దూకుడు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు బిట్‌కాయిన్ వైపు మొగ్గుచూపారు. మరోవైపు ఈక్విటీ మార్కెట్లు కూడా మంచి లాభాలు బాటపట్టాయి. ఇతర పెట్టుబడుల వైపు తమ డబ్బును ఇన్వెస్టర్లు మళ్లిస్తుండటంతో బంగారం డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గడంతో ధరలు పతనం అవుతున్నాయి. కొన్నేళ్లపాటు బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కొంతకొంత బంగారం కొనడం మంచిది. బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారి కోసం సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్ 10 అమ్మకాలు మొదలుపెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా . జనవరి 15 వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్స్ 10 గ్రాములు కొంటే రూ.51,040 చెల్లించాలి. ఆన్‌లైన్‌లో కొనేవారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com