ప్రజల ఆరోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ లో కూడా తెలంగాణ ప్రభుత్వం తనదైన ముద్ర వేసిందని చెప్పారు. ప్రతి రోజు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా తయారైన కొవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులకు కూడా త్వరలోనే టీకా పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా జరుగుతోందని అన్నారు. వ్యాక్సిన్ల పంపిణీలో తెలంగాణకు ఇప్పటికే రికార్డు ఉందని ఈటల చెప్పారు. కరోనా వ్యాక్సిన్ అన్ని స్థాయిలలోని ఆసుపత్రుల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇప్పటి వరకు ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారు. తొలి విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్న వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు.ప్రస్తుతం కరోనా టెస్టులను ప్రతి రోజు వేల సంఖ్యలో నిర్వహిస్తున్నామని చెప్పారు. అవసరమైతే ఆర్టీపీసీఆర్ పరీక్షలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.