ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి మనస్తాపానికి గురయ్యాడు. ఫైనాన్స్ వేధింపులకు సంబంధించి పోలీసులకు తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ ఆటో యజమాని వినూత్న పద్ధతిలో నిరసన తెలిపాడు. తన ఆటోకు నిప్పు పెట్టాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో జరిగింది. ప్రవీణ్ అనే వ్యక్తి పొట్ట కూటి కోసం ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆటో కొనుగోలు కోసం ఫైనాన్షియర్ల వద్ద డబ్బులు తీసుకున్నాడు. అయితే కరోనా నేపథ్యంలో గిరాకీ రాక కిస్తీలు కట్టడం ఆలస్యమైంది.
దీంతో ఫైనాన్స్ సిబ్బంది కిస్తీలు కట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారని ఆయన అన్నారు. అయితే వారి వేధింపులు భరించలేక పట్టణ పోలీసులకు ఫిర్యాదులు చేసినట్లు ప్రవీణ్ తెలిపాడు. ఫిర్యాదు చేయడంతో ఫైనాన్స్ వాళ్ల వేధింపులు మరింతగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదనే కోపంతో ప్రవీణ్ తన ఆటోను పరకాల పోలీస్ స్టేషన్ ఎదుట ఆటోను దగ్ధం చేసి నిరసన తెలిపాడు. ఈ సంఘటన పట్టణంలో సంచలనం రేపింది.