నాలుగేళ్లుగా ఆ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరోకరు విడిచి ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. ఇంతలో యువతి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మెుదలు పెట్టారు. దీంతో తనను త్వరగా పెళ్లి చేసుకోవాలని యువతి ప్రేమికుడిని కోరింది. తాను జీవితంలో స్థిరపడిన తరువాతే ఇద్దరం వివాహం చేసుకుందామని యువకుడు తెలిపారు. యువకుడి ప్రతిపాదనతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమికురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేయసి మరణానికి కారణమయ్యాననే మనో వేదనతో ఆ ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
నందిపేట్ మండలం ఖుదావంద్పూర్కు చెందిన డీకంపల్లి సుకన్య(21), అయిలాపూర్కు చెందిన ప్రేమ్ కుమార్(22) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పక్కపక్క గ్రామాలకు చెందిన వీరిద్దరు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో ఇటీవలే డిగ్రీ పూర్తిచేసుకున్నారు. యువతికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఆదివారం రాత్రి ఇద్దరూ ఫోన్ లో చాటింగ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకోవాలని ప్రేమ్కుమార్ను సుకన్య కోరింది. అయితే తానింకా స్థిరపడలేదని..కొన్నాళ్లు ఆగుదామని యువకుడు పేర్కొనడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుకన్య సోమవారం ఉదయం తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గదిలో నుంచి శబ్ధం రావడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందింది. అయితే అయిలాపూర్లో ఉన్న ప్రియుడు ప్రేమ్కుమార్కు ఈ విషయం తెలిసింది. దీంతో తీవ్ర వేదనకు గురై గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ శోభన్బాబు తెలిపారు.