తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం కొత్త పథకాలు..కొత్త ఆవిష్కరణలో ముందుకు వెళ్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని సౌందర రాజన్ కొనియాడారు.
ఎన్నో అంశాల్లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. కరోనాను ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతమని కొనియాడారు. కరోనా సమయంలో సొంత ఖర్చులతో వలస కూలీలను తరలించిన విషయాన్ని గుర్తు చేశారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఇకపోతే పల్లె ప్రగతి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.
హరితహారంలో నాటిన మొక్కల్లో 91 శాతం సంరక్షించినట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా 12వేలకు పైగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేస్తున్నాం. స్వదేశీ కొవిడ్ వ్యాక్సిన్తో ముందుకెళ్తున్నాం. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తొలి టీకాను అందించిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఫ్రంట్లైన్ వారియర్స్కు గవర్నర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.