తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా కండక్టర్లకు కొత్త యూనిఫాం అందనుంది. మెరూన్ కలర్ లో యూనిఫామ్ను అందించనున్నారు. 2019 చివరిలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మహిళా కండక్టర్లకు కొత్త యూనిఫామ్ అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. రేమండ్స్ కంపెనీ నుంచి 30 వేల మీటర్ల వస్త్రాన్నిసరఫరా చేస్తారు. వారు ఆ వస్త్రాన్ని కుట్టించుకుని నిత్యం ఆప్రాన్ ధరించి విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.
సాధారణంగా వస్త్రంతో పాటు యూనిఫాం కుట్టు కూలీలకు కూడా ఆర్టీసీ డబ్బులు చెల్లిస్తుంటుంది. కానీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున వస్త్రం మాత్రమే ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. కుట్టుకూలీ డబ్బులు ఉద్యోగులే భరించుకోవాల్సి వస్తోంది. ఆర్టీసీలో ప్రతి మూడేళ్లకోసారి రెండు జతల చొప్పున ఉద్యోగులకు యూనిఫాం అందిస్తుంటారు. కానీ గత ఆరేళ్లుగా యూనిఫాం జారీ నిలిచిపోయింది. సిబ్బందే సొంత ఖర్చులతో యూనిఫాం కొనుక్కుని వేసుకుంటున్నారు. కొంత మంది పాత యూనిఫాంతోనే నెట్టుకొస్తున్నారు. ఆర్టీసీ ఇప్పుడు కేవలం మహిళలకు మాత్రమే యూనిఫాం ఇవ్వనుంది.