మేడారం: వనదేవతలు కొలువై ఉన్న మేడారానికి భక్తులు బారులు తీరారు. చిన్న జాతరలో భాగంగా రెండో రోజు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటున్నారు. మహా జాతరకు వచ్చినట్లే చిన్న జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారానికి భారీగా చేరుకుంటున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, గద్దెలపై సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
భక్తుల సౌకర్యార్ధం అధికారులు ప్రత్యేకంగా ఐదు షెడ్లను ఏర్పాటు చేశారు. హన్మకొండ, ములుగు నుంచి బస్సులను నడుపుతున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మూడు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలతోపాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో భక్తులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. మేడారం చిన్న జాతర నిన్న ప్రారంభమయ్యింది. నాలుగు రోజులపాటు (ఈనెల 27 వరకు) జరుగనుంది. మొదటిరోజు 60 వేల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు.