ఎన్నో దేవుళ్లకు మొక్కుకుంటే, ఎన్నో మొక్కులు చెల్లిస్తే వరంలా ఓ బాబు పుట్టాడని ఆ తల్లి సంతోషపడింది. పిల్లాడిని అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. క్షణం కూడా విడిచి ఉండలేనంత ప్రేమను పెంచుకుంది. ప్రస్తుతం ఆ బాబు వయసు ఎనిమిది నెలలు. కానీ ఇంతలోనే ఆ బాబుకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. కన్న కొడుకు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. తన బిడ్డ మృతికి కట్టుకున్న భర్తే కారణమని తెలిసి ఆమె గుండె పగిలిపోయింది. తాగిన మత్తులో అతడు చేసిన నిర్వాకానికి అభం శుభం తెలియని పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తెలిసి కుటుంబమంతా కన్నీటిపర్యంతమవుతోంది. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.