కరోనా బారిన పడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్ కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో సీఎం కు నెగిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఏప్రిల్ 19న నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు అప్పటి నుంచి ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌజ్ లో ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందారు. తాజా పరీక్షల్లో కేసీఆర్ కు కరోనా నెగిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగున్నట్లు వ్యక్తిగత వైద్యులు తెలిపారు. కరోనా నుంచి కోలుకోవడంతో సీఎం తిరిగి పూర్తిస్థాయి అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. నేడు హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తోంది. ఈటల ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో తన వద్దే ఉన్న ఆరోగ్య శాఖ పై సమీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.