తనను ప్రేమించడం లేదనే కోపంతో ఓ యువకుడు ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత సదరు యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మన్నెగూడెంకు చెందిన రాజ్కుమార్ అనే యువకుడు తనను ప్రేమించాలని గత కొంతకాలంగా జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్కు చెందిన ఓ యువతి వెంటపడుతున్నాడు. ఆ యువతి అతడి ప్రేమను తిరస్కరించింది. ఈ క్రమంలో కోపం పెంచుకున్న రాజ్కుమార్ శనివారం జాబితాపూర్ కు చేరుకొని యువతిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తన గొంతు కోసుకున్నాడు. ఇద్దరికి గాయాలవగా.. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.