ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాత కక్షలతో వేటాడి వెంటాడి దారుణంగా చంపేశారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 13, 2021, 04:27 PM

పాత కక్షలతో విధ్వంసం తగదని వారించబోయిన యువకుడిని లారీతో వెంటాడి వేటాడి ఢీ కొట్టి చంపిన దురాగతం రంగారెడ్డి జిల్లా, ఆమనగల్ మండలం, మేడిగడ్డ గేట్ సమీపంలో చోటు చేసుకుంది. మేడిగడ్డ తండాకు చెందిన బాలకిషన్ సింగ్, నిరంజన్ సింగ్ కుటుంబాల మధ్య 20 ఏళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. నిరంజన్ సింగ్, రాజేష్ సింగ్‌లు అన్నాదమ్ములు. 2004లో జరిగిన ఘర్షణలో వారి తల్లిదండ్రులు హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య తరచూ తగాదాలు చోటు చేసుకుంటున్నాయి.


బాలకిషన్ సింగ్ నుంచి తమకు ప్రాణభయం ఉందని ఇటీవల నిరంజన్ సింగ్, రాజేష్ సింగ్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భయం నేపథ్యంలో సోదరులిద్దరూ తమ మిత్రులు, అనుచరులను రక్షణగా ఉంచుకుని రెండు కార్లలలో మేడిగడ్డ గేటు సమీపంలో ఉన్న తమ వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని కూలీలతో వరికోత పనులు చేయిస్తున్నారు. బాలకిషన్ సింగ్ మరో ఐదుగురితో కలిసి లారీలో అక్కడకు చేరుకుని రెండు కార్లను ఢీ కొట్టి ధ్వంసం చేశారు. రాజేష్ సింగ్‌ స్నేహితుడు సందీప్ అడ్డుకోబోతుండగా నిందితులు లారీని అతనిపైకి పోనిచ్చారు. దీంతో ఆయన తప్పించుకునేందుకు రోడ్డుపై పరుగులు తీశాడు. అయినా లారీతో వెంటాడి.. వేటాడి ఢీ కొట్టారు. కిందపడిపోయిన సందీప్‌ను లారీతో తొక్కించారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నిందితులు అక్కడి నుంచి పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com