మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మొదట.. నగరంలోని గన్పార్క్ దగ్గర రేపు అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటలతో పాటు ముఖ్యనేతలు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమతో పాటు మరికొంతమంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకొనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.