వరంగల్లో సెంట్రల్ జైలును తరలించిన స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్టుగానే చంచలగూడలోని జైలును తరలించి ఆ స్థలంలో విద్యా, ఉపాధి శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. జైలును తరలిస్తే సుమారు 45 ఎకరాల స్థలం లభిస్తుందన్నారు. ఇందులో హైదరాబాద్ దక్షిణప్రాంత ప్రజలకు వినియోగపడే విధంగా హార్డ్వేర్ పార్క్ను అభివృద్ధి చేయాలని ఒవైసీ శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు త్వరలో సీఎంను కలిసి వినతి పత్రం సమర్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.