ఏపీ,తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అలర్ట్ ప్రకటించాయి. వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ- 7.6 కి.మీ మధ్య విస్తరించింది. ఈ ప్రభావంతో ఈ నెల 23న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వివరించారు. విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 3 రోజుల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. . హైదరాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణవ్యాప్తంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతేనే తప్పా బయటికి వెళ్లవద్దని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల సీఎంలు దీని పై రివ్యూ నిర్వహించారు. అధికారులను అలర్ట్ చేశారు. పలు ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నది, కాలువల వెంట ఉన్న వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరో వైపు ఎన్డీఆర్ఎఫ్ టీంలను కూడా లోతట్టు ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ 2 రోజులు ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.