సోమవారం సమావేశం అయిన సింగరేణి బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెరగనుంది. వయసు పెంపు నిర్ణయం ఈ ఏడాది మార్చి 31 నుంచి అమలులోకి రానుందని.. ఈ నిర్ణయంతో మార్చి 31 జూన్ 30 మధ్య పదవీ విరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగాలు వస్తాయని.. 43,899 మంది అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. అంతేకాకుండా పెళ్లైన, విడాకులు పొందిన కుమార్తెలకూ కారుణ్య నియామకాల్లో అవకాశం దక్కనుంది. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగాల్లో 10శాతం ఈబీసీ రిజర్వేషన్ల అమలుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు సీఎండీ చెప్పారు. సింగరేణిలో అన్ని ఉద్యోగాలకు లింగబేధం లేకుండా అవకాశాలకు అనుమతికి సమావేశంలో ఆమోదం తెలిపినట్లు వివరించారు. 2021-22 ఏడాదికి సీఎస్ఆర్ ఫండ్ కోసం బోర్డు రూ.61 కోట్లు కేటాయించింది. ఇక సింగరేణి నిర్వాసిత కాలనీలకు సంబంధించి 201 ప్లాట్ల కేటాయించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.