సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు టీపీసీసీ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకుముందు ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ దినం సందర్భంగా ఇంద్రవెల్లిలో తొలి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను నిర్వహించారు. అనంతరం రావిర్యాల, మూడుచింతలపల్లిలో సభలు సక్సెస్ చేశారు. చివరి సభను గజ్వేల్ పట్టణంలో నిర్వహించనున్నారు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ వద్ద గల మైదానంలో జరగనున్న సభకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. సభను విజయవంతం చేసేందుకు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కష్టపడుతున్నాయి. సభకు లక్ష మంది వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.