తెలంగాణ రాష్ట్రంలోని వైన్ షాపుల లైసెన్స్ గడువును మరో నెల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ-4 దుకాణాల (వైన్ షాప్ల) లైసెన్స్ గడువు అక్టోబర్ 31తో ముగుస్తుంది. నవంబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రావాల్సి ఉంది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్థులకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2 రోజుల క్రితం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం, నూతన మద్యం పాలసీపై కసరత్తు కొనసాగుతుండడంతో ప్రస్తుతం ఉన్న దుకాణదారులకే మరో నెలపాటు గడువు ఇచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం ప్రస్తుత మద్యం పాలసీ నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ప్రస్తుత మద్యం దుకాణదారులను ప్రోత్సహించేలా ఇప్పటికే 10 సార్లు సరుకు తీసుకున్నవారి మార్జిన్ ను 6.4 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 తర్వాత 10 సార్లు కోటాను దాటినవారికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తించనుంది. అదేవిధంగా బార్లకు లైసెన్స్ ఫీజులో ఒక నెల మొత్తాన్ని రిబేట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం బార్ లైసెన్స్ ఫీజును 12 భాగాలుగా చేసి, అందులో ఒక నెల మొత్తాన్ని రిబేట్గా ఇస్తారు. ఈ మొత్తాన్ని ఒక్కో నెలలో కొద్దిమొత్తం చొప్పున మినహాయిస్తారు.