తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను అన్ని డ్రగ్స్ అనాలసిస్ టెస్టులకు సిద్ధం అని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను అన్ని డ్రగ్స్ అనాలసిస్ టెస్టులకు సిద్ధం అని, మరి రాహుల్ గాంధీ సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. 'నన్ను డ్రగ్స్ కు అంబాసిడర్ అని అంటారా.. నాకు డ్రగ్స్కు సంబంధం ఏంటి' అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎవడో పిచ్చోడు.. ఈడీ కి లెటర్ ఇచ్చాడని కేటీఆర్ మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ కు వచ్చాడా.. ఫామ్ హౌస్లో ఉన్నాడా కాదు.. పనులు అవుతున్నాయా? లేదా? చూడాలన్నారు. సీఎం ను పట్టుకొని తాగుబోతు అనడం సరికాదన్నారు. ఎవర్నీ వదిలి పెట్టం.. వాళ్ళ బాగోతం మొత్తం తెలుసు బయట పెడతాం.. అవసరమైతే రాజద్రోహం కేసులు పెడుతామని కేటీఆర్ అన్నారు. కొంత మంది నాయకులు బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదిస్తున్నారు. సున్నాలు వేసుకునే వాళ్లు కన్నాలు వేస్తున్నారు. మల్లారెడ్డి సవాల్కు భయపడి పారిపోయినోడు.. నోటికి వచ్చినట్టు వాగడం తప్ప ఏం చేయడం లేదని రేవంత్ రెడ్డిని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ పార్టీలకు సిల్లి పాలిటిక్స్ మాత్రమే తెలుసని, తెలంగాణ ప్రజలకు ఏం కావాలో వారికి తెలియదన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించిందని, ప్రతిపక్షాలకు పని లేక పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. ఒకరు పాదయాత్ర, ఇంకొకరేమో తాను ఉన్నానని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, జనసంఘ్ ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు చరిత్రకు మతం రంగు పూస్తున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణలో కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు జాతీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఓట్లను చీల్చడం కోసమే కొత్త పార్టీలు వస్తున్నాయని, ఏదో ఒక జాతీయ పార్టీతో కొమ్ము కాస్తున్నాయన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో కేసీఆర్ ను పొగిడారని.. ఇప్పుడేమో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి నవోదయ విద్యాలయాలు రాకపోతే కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడని కేటీఆర్ అడిగారు. షర్మిల కూడా అలానే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.