కరోనా కాటుకు అన్ని వర్గాల వారూ ఆర్థికంగా చితికిపోయారు.ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి జీవనం కష్టంగా మారింది. ఈ తరుణంలో తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించడం గగనమవుతోంది. దీంతో పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు చూస్తున్నారు.ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. గతంలో పాఠశాలల్లో అడ్మిషన్లకు కట్ ఆఫ్ డేట్ ఆగస్టు వరకు ఉండేది. ప్రస్తుతం అలాంటి నిబంధనలను తొలగించి పాఠశాలలకు వచ్చిన వారందరికీ అడ్మిషన్ ఇస్తున్నారు. ఈఏడాది 10వ తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటి వరకు అన్ని తరగతుల్లో కొత్తవారిని చేర్చుకునే అవకాశం ఉంది.అయితే జిల్లాలో ఎక్కువగా 3,6 తరగతుల్లోనే ఎక్కువగా అడ్మిషన్లు జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఒక్కో హైస్కూల్లో 40 నుంచి 50 మంది కొత్తగా చేరడం విశేషం.ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు,బస్సుకు అదనంగా మరికొంత రుసుం చెల్లించలేక సతమతమవుతున్న తల్లిదండ్రులు పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు అడ్మిషన్లు పెరుగుతున్నాయి.2020-21 విద్యా సంవత్సరంలో జిల్లాలో 11,895 మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. ఇందులో కొందరు ప్రైవేటు పాఠశాలల నుంచి రాగా, మరికొందరు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఒకదాంట్లో నుంచి మరో బడిలో చేరిన వారు ఉన్నారు.ఇక ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల ప్రారంభం నుంచి ఇప్పటివరకే 8,405 మంది సర్కారు బడుల్లో చేరారు.ఇందులో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చిన వారు 1,789 మంది ఉన్నారు.అక్టోబర్ 10 వరకు అవకాశం ఉండడంతో అడ్మిషన్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈనెల 1 నుంచి ప్రభుత్వం విద్యాసంస్థలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. కరోనా భయంతో మొదట్లో పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రు లు కొందరు సుముఖత చూపలేదు. కానీ విద్యాశా ఖాధికారుల ప్రచారం, తీసుకుంటున్న జాగ్రత్తల నేపథ్యంలో క్రమంగా పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతోంది. ప్రారంభంలో 27 శాతం మంది మాత్రమే విద్యార్థులు బడికి రాగా, ప్రస్తుతం 50 శాతం దాటుతోంది. సౌకర్యాలు అంతంతే.. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లతో పాటు, హాజరు శాతం కూడా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు మాత్రం లేవు. దీం తో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బంది పడుతు న్నారు. కరోనా భయం పొంచి ఉన్నందున తరగతి గదుల్లో భౌతికదూరం పాటించాలి. కానీ గదులు, బెంచీల కొరతతో భౌతికదూరం అమలు కావడం లేదు. ఇక పట్టణాల్లోని పాఠశాలల్లో మిషన్ భగీరథ పంపులు లేక తాగునీటికి ఇబ్బంది తప్పడం లేదు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాల, ఇంగ్లిష్ మీడియం పాఠశాల, బూడిదగడ్డ ప్రభుత్వ పాఠశాల్లోనే నీటికి తిప్పలు పడుతు న్నారు. ఇక మారుమూల ప్రాంతాల పాఠశాలల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కూలీలైన్ పాఠశా లలో బోరు పని చేయకపోవడంతో పాఠశాల ప్రధా నోపాధ్యాయుడే సొంత ఖర్చులతో మరమ్మతు చేయించారు. జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టి ఆయా పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.